నాగర్కర్నూల్, జూలై 2 (ఎస్బి న్యూస్): కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న వీబీజీ రాంజీ చట్టాన్ని వెంటనే రద్దు చేసి, ప్రస్తుతం అమలులో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్నే యథాతథంగా కొనసాగించాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు దేశ్యానాయక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని బల్మూర్ మండల కేంద్రంలో రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, ఉపాధి హామీ కూలీల ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు.
నిరసనలో భాగంగా అంబేద్కర్ కూడలి నుంచి వందలాది మంది ఉపాధి హామీ కూలీలు, రైతులు, వ్యవసాయ కార్మికులు ర్యాలీగా బయలుదేరి ఎంపీడీవో కార్యాలయానికి చేరుకుని ధర్నా చేపట్టారు. చేతుల్లో ప్లకార్డులు, బ్యానర్లతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. అనంతరం ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా దేశ్యానాయక్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో పేద కుటుంబాలకు ఉపాధి హామీ చట్టం జీవనాధారంగా మారిందన్నారు. అలాంటి చట్టాన్ని బలహీనపరిచే విధంగా కొత్త వీబీజీ రాంజీ చట్టాన్ని తీసుకురావడం సరైన నిర్ణయం కాదని విమర్శించారు. కొత్త చట్టం అమల్లోకి వస్తే గ్రామీణ పేదలు, వ్యవసాయ కూలీలు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు.
కొత్త ప్రతిపాదనల ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి ఇచ్చే నిధుల వాటా తగ్గే అవకాశం ఉందని నాయకులు పేర్కొన్నారు. అలాగే వ్యవసాయ సీజన్లో పనిదినాలకు పరిమితులు విధించడం వల్ల కూలీలకు ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయని తెలిపారు. కనీస వేతనాలపై స్పష్టమైన హామీ లేకపోవడం కూడా ఆందోళన కలిగించే అంశమని అన్నారు.
అదేవిధంగా ప్రతి పనికి ఫోటోలు అప్లోడ్ చేయడం వంటి నిబంధనల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో సాంకేతిక సమస్యలు ఎదురయ్యే అవకాశముందని, దీంతో కూలీలు అనవసర ఇబ్బందులు పడాల్సి వస్తుందని నాయకులు పేర్కొన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ల ఉద్యోగ భద్రత కూడా ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఉపాధి హామీ చట్టం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో లక్షలాది కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయని, ఈ చట్టాన్ని బలోపేతం చేయాల్సింది పోయి కొత్త నిబంధనలతో బలహీనపరచడం సమంజసం కాదని రైతు సంఘం నాయకులు అన్నారు. ఉపాధి హామీ కూలీల హక్కులను కాపాడాలని, పాత చట్టాన్నే కొనసాగించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
0 కామెంట్లు