తుమ్మలచెరువు వద్ద వర్షాల కోసం రైతుల ప్రత్యేక పూజలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట సమీపంలోని చారిత్రక తుమ్మలచెరువు వద్ద శనివారం సర్పంచ్ మర్రి సంధ్యమల్లారెడ్డి ఆధ్వర్యంలో రైతులు మంచి వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ రైతులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పులిహోరను నైవేద్యంగా సమర్పించి గ్రామాభివృద్ధితో పాటు వ్యవసాయానికి అనుకూలంగా సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రార్థించారు. వేదమంత్రాలు, భజనలు, గోవింద నామస్మరణలతో తుమ్మలచెరువు పరిసరాలు భక్తి పారవశ్యంతో మార్మోగాయి. కాకతీయుల కాలంలో నిర్మించబడిన ఈ చెరువు స్థానిక రైతులకు సాగునీటి ప్రధాన ఆధారమని, ప్రతి ఏడాది వర్షాకాల ప్రారంభంలో ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని గ్రామ పెద్దలు తెలిపారు. అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ఈ ఏడాది చెరువు పూర్తిగా నిండి రైతుల పొలాలు పచ్చని పంటలతో కళకళలాడాలని రైతులు ఆకాంక్షించారు.
0 కామెంట్లు