పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం జానంపేట గ్రామపంచాయతీలో చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్న అవినీతి, ఆర్థిక అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని పినపాక పీఏసీఎస్ అధ్యక్షుడు వీఎస్ఆర్ వర్మ డిమాండ్ చేశారు.
మంగళవారం జానంపేట గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గ్రామపంచాయతీ నిధుల వినియోగంలో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపించారు. అసిస్టెంట్ జీతాలు, బోర్ల మరమ్మత్తులు, సైడ్ కాలువల పూడికతీత, ట్రాక్టర్ డీజిల్, రిపేర్లు, వీధి దీపాల నిర్వహణ పేరిట భారీ మొత్తాలు ఖర్చు చేసినట్లు రికార్డుల్లో చూపిస్తున్నారని, వీటిపై పూర్తి స్థాయి విచారణ అవసరమని పేర్కొన్నారు.
పక్క మండలానికి చెందిన వ్యక్తుల పేర్లపై కూడా నిధులు విడుదలైనట్లు సమాచారం ఉందని, బినామీ ఖాతాలకు నిధులు మళ్లించినట్లు అనుమానాలు వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీ నిధుల వినియోగంపై ప్రత్యేక ఆడిట్ నిర్వహించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు.
గత పాలకవర్గం హయాంలో రావాల్సిన నిధుల లెక్కలు ప్రజలకు వెల్లడించాలని, ప్రస్తుతం అందుతున్న నిధులను కూడా పారదర్శకంగా వినియోగించాలని డిమాండ్ చేశారు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.
జిల్లా పంచాయతీ అధికారి (డీఎల్పీఓ), జిల్లా కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకుని అన్ని ఆర్థిక లావాదేవీలపై ప్రత్యేక విచారణ నిర్వహించాలని వర్మ కోరారు. అవసరమైతే ప్రత్యేక కమిటీని నియమించి అక్రమాలపై నిజానిజాలు వెలికితీయాలని సూచించారు.
ఈ సమావేశంలో మాజీ ఉపసర్పంచ్ రాయల సత్యనారాయణ, బీసీ సెల్ నాయకుడు సుగ్గాల శ్రీకాంత్, ఎస్సీ సెల్ నాయకుడు బోడ సర్వేశ్వరరావు, ఎస్టీ సెల్ నాయకుడు ఈసం వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ నాయకులు దుర్గం కోటేశ్వరరావు, గుండం దామోదర్ తదితరులు పాల్గొన్నారు.
#Janampeta #Pinapaka #VSRVarma #GramPanchayat #CorruptionAllegations #BhadradriKothagudem #BRS #SBNEWS #TelanganaNews
0 కామెంట్లు