శివాలయం వద్ద డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించాలి: సీపీఎం

ఆదోని మండలం పెద్ద తుంబలం గ్రామంలోని శివాలయం సమీపంలో ఆర్‌అండ్‌బీ రోడ్డుపై ఉన్న కల్వర్టు బండలు కుంగిపోవడంతో నీరు నిలిచిపోయి దుర్వాసన వెదజల్లుతోందని, దీనివల్ల స్థానిక ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడిందని సీపీఎం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కే. వెంకటేశులు, మండల కార్యదర్శి లింగన్న డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక సీపీఎం నాయకులు హనుమంత్ రెడ్డి, దాసప్ప, కాజా తదితరులు గ్రామస్తులతో కలిసి సమస్యాత్మక ప్రాంతాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, శివాలయం వద్ద నెలకొన్న డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని, స్థానిక పంచాయతీ అధికారులు మరియు ఆర్‌అండ్‌బీ అధికారులు వెంటనే స్పందించి కల్వర్టు మరమ్మతులు చేపట్టి డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. లేనిపక్షంలో గ్రామ సచివాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు