నాగర్కర్నూల్, జూన్ 12: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకాన్ని వేగవంతంగా పూర్తి చేసి అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం అమ్రాబాద్ మండలం మున్ననూరు గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన ఆయన, నిర్మాణాల్లో నాణ్యత, పారదర్శకత, సమయపాలనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
అదనపు కలెక్టర్ దేవసహాయంతో కలిసి లబ్ధిదారులతో మాట్లాడిన కలెక్టర్, నిర్మాణ పనుల పురోగతి, ఎదురవుతున్న సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ప్రతి ఇంటి నిర్మాణం చేపట్టాలని, నాణ్యత విషయంలో రాజీ పడొద్దని స్పష్టం చేశారు.
అనంతరం మున్ననూరు రైతు వేదికలో జరిగిన సమీక్ష సమావేశంలో అచ్చంపేట నియోజకవర్గ పరిధిలో మొదటి విడతలో మంజూరైన 3,500 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతి, రెండో విడత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై అధికారులతో చర్చించారు. రెండో విడత లబ్ధిదారుల ఎంపికను పూర్తిస్థాయి పారదర్శకతతో నిర్వహించాలని, ఈ నెల 20వ తేదీలోగా వివరాలను సమర్పించాలని ఆదేశించారు.
గ్రామాల్లో ఇప్పటికీ పూరిగుడిసెల్లో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలను గుర్తించి వారికి పథకం ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో హౌసింగ్, పంచాయతీ రాజ్ శాఖల అధికారులు, ఎంపీడీవోలు, ఇంజినీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
0 కామెంట్లు