గుండాల, మే 12 (స్వాతంత్ర్య భారత్):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు పట్టణంలో మే 11, 12, 13 తేదీల్లో నిర్వహిస్తున్న అఖిల భారత ఐక్య రైతు సంఘం జాతీయ ప్రథమ మహాసభలకు గుండాల మండలం నుండి రైతు సంఘ ప్రతినిధులు తరలి వెళ్లారు.
ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతు సంఘ నాయకుడు ఈసం సింగన్న మాట్లాడుతూ దేశంలోని 16 రాష్ట్రాల రైతు సంఘాలు ఐక్యంగా ఏర్పడి ఈ జాతీయ మహాసభలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలకు వివిధ రాష్ట్రాల రైతు నాయకులు హాజరవుతున్నారని చెప్పారు.
దేశంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు, వ్యవసాయ సంక్షోభం, పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, రుణమాఫీలలో జాప్యం, ధాన్యం కొనుగోలులో ప్రభుత్వాల నిర్లక్ష్యం వంటి అంశాలపై ఈ మహాసభల్లో చర్చించనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా రైతుల పరిస్థితిలో మార్పు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వడ్డే శోభనాద్రిశ్వరరావు ఈ మహాసభల్లో ప్రసంగించనున్నట్లు తెలిపారు.
ఈ మహాసభలకు బయలుదేరిన వారిలో ఈసం శంకరన్న, కోరం శాంతన్న, కుమారన్న, తెల్లం రాజు, ఈసం కృష్ణన్న, రియాజ్, గడ్డం రమేష్, ఎస్కే వసీం తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్లు