వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే మహాత్ములే గురువులు: ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే మహాత్ములే గురువులు: ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
గురువు అనేది కేవలం పాఠాలు చెప్పేవారు మాత్రమే కాదు, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే మహానుభావులు అని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం బయ్యారంలోని జీవీఆర్ ఫంక్షన్ హాల్ లో ప్రముఖ సాహితీవేత్త, విశిష్ట ఉపాధ్యాయులు ఎర్రా ప్రగడ రామమూర్తి రచించిన “స్వగతాలకు స్వాగతాలు”, “నేనొక నిత్య విద్యార్థిని” పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పుస్తకాలను ఆవిష్కరించి రచయితను సన్మానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తన గురువర్యులు రామమూర్తి అందించిన మార్గదర్శకత్వం, విలువలు, క్రమశిక్షణ తన ప్రజా జీవితానికి పునాది అని పేర్కొన్నారు. “నేనొక నిత్య విద్యార్థిని” పుస్తకం జీవితాంతం నేర్చుకోవాలనే భావనను పెంపొందిస్తుందని, ప్రతి ఒక్కరూ చదవదగిన గ్రంథమని అన్నారు. “స్వగతాలకు స్వాగతాలు” పుస్తకం ఆత్మపరిశీలనకు దారి తీసే సాహిత్య కృతిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.

సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర అపారమని, ఉపాధ్యాయులు దేశ భవిష్యత్తుకు మార్గదర్శకులని ఎమ్మెల్యే కొనియాడారు. గురువును సన్మానించడం తనకు గర్వకారణమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మానుకొండ నాగేశ్వరరావు, ఎన్‌సీహెచ్ చక్రవర్తి, ఎర్ర ప్రగడ రామకృష్ణ, శత్రువేదుల నాగేంద్ర, దహంగాం సాంబమూర్తి, సన్నిధానం నరసింహారావు శర్మ, అమ్మిన శ్రీనివాసరాజు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, సాహితీ ప్రియులు, విద్యార్థులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు