ఆదోని పట్టణంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలకు మద్దతు ఇస్తున్న డిప్యూటీ డీఈఓను సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయనతో పాటు పట్టణ అధ్యక్షుడు సంజయ్ మాట్లాడుతూ, ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమయ్యారని విమర్శించారు.
విద్యార్థుల ఇళ్లకు వెళ్లి అడ్మిషన్ల కోసం ఒత్తిడి చేయడం, పుస్తకాలు, టై-బెల్ట్ పేర్లతో తల్లిదండ్రుల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్న యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. డిప్యూటీ డీఈఓ కార్యాలయంలో అందుబాటులో లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, తన నివాసాన్ని కార్యాలయంగా ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని తెలిపారు.
ప్రైవేట్ పాఠశాలల ఫైళ్లపై సంతకాలు చేయాలంటే సాయంత్రం తర్వాత ఇంటికి రావాలని చెప్పడం అనుమానాస్పదమని పేర్కొన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి వెంటనే స్పందించి విచారణ జరిపి సంబంధిత అధికారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నేతలు డిమాండ్ చేశారు.
0 కామెంట్లు