ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పరీక్ష సామాగ్రి పంపిణీ
గుండాల మండలం, మార్చ్ 13 (స్వాతంత్ర్య భారత్ ప్రతినిధి):
గుండాల మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులకు గుండాల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పరీక్షలకు అవసరమైన సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం 50 మంది పదో తరగతి విద్యార్థులకు పెన్నులు, పెన్సిళ్లు, ప్యాడ్లు, ఇతర అవసరమైన పరీక్షా సామగ్రిని అందజేశారు.
ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రాంబాబు, ఉపాధ్యక్షులు ఎస్.కే. షారోజ్ మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో మంచి స్థాయికి చేరుకోవాలంటే పదో తరగతి పరీక్షలు ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించి పాఠశాలకే కాకుండా తమ తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. పరీక్షల సమయంలో భయం లేకుండా ధైర్యంగా పరీక్షలు రాయాలని, సమయాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని విద్యార్థులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె. శ్రావణ సంధ్య మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ సభ్యులు విద్యార్థులకు అవసరమైన సామాగ్రిని అందించడం అభినందనీయమని తెలిపారు. విద్యార్థుల చదువుకు ఇలాంటి ప్రోత్సాహం చాలా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ గౌరవాధ్యక్షులు వేల్పు నరసింహారావు, మంకిడి సుధాకర్, కె. నాగార్జున, రమణ బాబు, రమేష్, గణేష్, మలిపెద్ది పవన్, పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
0 కామెంట్లు