సింగరేణి మణుగూరు ఏరియా ఓసి-2లోని బేస్ వర్క్ షాప్లో రంజాన్ నెల ఉపవాస దీక్షలు, ఉగాది పర్వదినం సందర్భంగా గురువారం మతసామరస్యం వెల్లివిరిసింది. “హిందూ–ముస్లిం భాయీ భాయీ” భావంతో పరస్పర విందు కార్యక్రమాలు నిర్వహిస్తూ కార్మికులు పరస్పరం గౌరవాన్ని చాటుకున్నారు.
ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా ఉపవాస దీక్షలో పాల్గొంటున్న ముస్లిం సోదరులకు హిందూ, క్రైస్తవ కార్మికులు ఫ్రూట్స్ కిట్లు అందజేశారు. అందుకు ప్రతిగా ముస్లిం సోదరులు రంజాన్ ప్రత్యేక వంటకం ఖీర్ ఖుర్మా (సేమియా) విందును ఏర్పాటు చేశారు. ఈ స్నేహపూర్వక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
మెయింటెనెన్స్ సెక్షన్ ఉద్యోగి, కార్మిక నాయకుడు షేక్ అబ్దుల్ రవూఫ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి పీకే ఓసి ప్రాజెక్ట్ ఇంజనీర్ జె. వీరభద్రుడు ముఖ్య అతిథిగా, రక్షణ అధికారి అడిషనల్ మేనేజర్ ఎం. లింగబాబు విశిష్ట అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కులం, మతం భిన్నమైనా అందరం సింగరేణి తల్లి బిడ్డలమేనని, ఒకే కుటుంబంగా సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. మతసామరస్యానికి ఇఫ్తార్ విందు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు.
అనంతరం కార్మికులు పరస్పరం ఆలింగనం చేసుకుని ఆనందాన్ని పంచుకున్నారు. ఉగాది శుభాకాంక్షలతో పాటు ముస్లిం సోదరులకు ముందస్తు ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఇంజనీర్లు, సెక్షన్ ఇన్చార్జ్లు, ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
0 కామెంట్లు