నాగర్కర్నూల్, ఫిబ్రవరి 06 (ఎస్బి న్యూస్): నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని పదర మండలం రాయలగండి గ్రామంలో ఉన్న కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని అచ్చంపేట ఎమ్మెల్యే, టీపీసీసీ ఉపాధ్యక్షులు, డీసీసీ అధ్యక్షులు డా. చిక్కుడు వంశీకృష్ణ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల నిర్వహణ, విద్యార్థుల విద్యాభివృద్ధి, ఉపాధ్యాయుల పనితీరు, హాస్టల్ సదుపాయాలపై వివరంగా ఆరా తీశారు. పాఠశాల పరిసరాల్లో పరిశుభ్రతను కట్టుదిట్టంగా పాటించాలని, విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ, తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. విద్యార్థుల కోసం కాస్మెటిక్ చార్జీల పెంపు, స్నాక్స్ పంపిణీ వంటి సదుపాయాలు కల్పించడం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. కస్తూర్బాగాంధీ బాలికల విద్యార్థుల విద్యా స్థాయి, జీవన పరిస్థితులను నేరుగా తెలుసుకునేందుకే ఈ తనిఖీ నిర్వహించామని తెలిపారు.
పాఠశాలలో ఎదురవుతున్న సమస్యలపై జిల్లా విద్యాశాఖ అధికారులతో చర్చించి, వాటిని తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం నూతన ఐమాక్స్ లైట్ల ఓపెనింగ్ కార్యక్రమంలో కూడా ఎమ్మెల్యే పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
0 కామెంట్లు