Subscribe Us

SB LATEST:

3, జనవరి 2026, శనివారం

పీకే ఓసి డీప్ సైడ్ విస్తరణ గని సింగరేణికే కేటాయించాలి : పాయం వెంకటేశ్వర్లు

హైదరాబాద్ / పినపాక 
మణుగూరు ఏరియా పీకే ఓసి డీప్ సైడ్ విస్తరణ గనిని సింగరేణి సంస్థకే కేటాయించి మణుగూరు ప్రాంత మనుగడను కాపాడాలని కోరుతూ పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ను శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఆయన ఛాంబర్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, పీకే ఓసి డీప్ సైడ్ గనిని సింగరేణి సంస్థకు కేటాయించకపోతే మణుగూరు ప్రాంతం తీవ్ర ఆర్థిక-సామాజిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని వివరించారు. మిగిలిన గనులు క్రమంగా మూతపడటం, మణుగూరు ప్రాంత అభివృద్ధి పూర్తిగా నిలిచిపోవడం, సింగరేణి శాశ్వత ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరిగా జరగడం, ఇతర ప్రాంతాల గనులు కూడా ప్రభావితమవడం వంటి సమస్యలు తలెత్తుతాయని తెలిపారు.
అదేవిధంగా శాశ్వత ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గిపోవడం, గనుల విభాగంలో ఉపాధి అవకాశాలు పూర్తిగా కోల్పోవడం, దాదాపు వెయ్యిమంది కాంట్రాక్ట్ కార్మికులు, పదిహేను మంది ఓబీ కార్మికులు ఉపాధిని కోల్పోవడం వంటి పరిస్థితులు ఏర్పడతాయని చెప్పారు. బొగ్గు రవాణా వ్యవస్థ దెబ్బతిని లారీ యజమానులు, డ్రైవర్లు, క్లీనర్లు, మెకానిక్ షెడ్లు తీవ్రంగా నష్టపోతాయని, అనేక కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. భూములు, ఇళ్ల ధరలు పడిపోవడంతో పాటు పరోక్ష ఉపాధి కూడా తీవ్రంగా దెబ్బతింటుందని తెలిపారు.
ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి, పీకే ఓసి డీప్ సైడ్ విస్తరణ గనిని తెలంగాణ జెన్‌కోకు కాకుండా కేవలం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కే కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ఉపముఖ్యమంత్రిని కోరారు. దీనిపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
అనంతరం సింగరేణి భవన్‌లో సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డి. కృష్ణ భాస్కర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్‌టీయూ నాయకులు యస్.డి. నాసర్ పాషా పాల్గొని, మణుగూరు మనుగడ కోసం ఎమ్మెల్యే చేస్తున్న కృషిని అభినందించారు. ప్రభుత్వం స్పందించి పీకే ఓసి డీప్ సైడ్ విస్తరణ గనిని సింగరేణికే కేటాయించాలని వారు విజ్ఞప్తి చేశారు.
మణుగూరు ప్రాంత భవిష్యత్తును కాపాడే దిశగా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆశాభావం వ్యక్తం చేశారు.