నీట్ నిరసనలపై పోలీసుల చర్యలను ఖండించిన తెలంగాణ జన సమితి

నీట్ నిరసనలపై పోలీసుల చర్యలను ఖండించిన తెలంగాణ జన సమితి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ జన సమితి (టీజేఎస్) జిల్లా కమిటీ ఢిల్లీలో నీట్ పరీక్ష పేపర్ లీకేజీ అంశంపై జరుగుతున్న నిరసనల్లో విద్యార్థులపై పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండించింది. నీట్ పేపర్ లీకేజీ కారణంగా నష్టపోయిన విద్యార్థుల కుటుంబాలకు రూ.1 కోటి చొప్పున నష్టపరిహారం అందించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.

జిల్లా ప్రధాన కార్యదర్శి పగడాల కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, పార్లమెంట్ ముట్టడి కార్యక్రమంలో గాంధేయ మార్గంలో ర్యాలీ నిర్వహించిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేసి, టియర్ గ్యాస్ ప్రయోగించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని విమర్శించారు. నిరాహార దీక్ష చేస్తున్న ఉద్యమకారులు అభిజిత్ దీపేక్, విద్యావేత్త వాంగ్‌చుక్‌లను అరెస్టు చేయడాన్ని కూడా ఆయన ఖండించారు.

నీట్ పేపర్ లీకేజీకి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యలకు కేంద్ర ప్రభుత్వం బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్ర్య హక్కును కేంద్ర ప్రభుత్వం హరించకూడదని, విద్యార్థులపై లాఠీచార్జ్‌కు బాధ్యులైన పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని కోరారు. కాక్రోచ్ పార్టీ చేపడుతున్న ప్రజా పోరాటానికి తెలంగాణ జన సమితి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అశ్వాపురం మండల అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, కార్యదర్శి మధు, లక్ష్మి, కాకర్ల రామారావు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1 కామెంట్‌లు