నారాయణ పాఠశాలపై పీడీఎస్ఓ ధర్నా.. అధిక ఫీజుల వసూళ్లపై ఆగ్రహం
ఆదోని, జులై 18 (ఎస్బి న్యూస్): ఆదోనిలోని నారాయణ పాఠశాల ఎదుట పీడీఎస్ఓ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో శనివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. విద్య పేరుతో కార్పొరేట్ పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్నాయని సంఘం రాష్ట్ర నాయకుడు తిరుమలేష్ ఆరోపించారు.
ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఆధార్ కార్డుల ఆధారంగా అడ్మిషన్లు చేపడుతున్నారని, ప్యానల్ బోర్డులు, యాప్లు, టెక్నో కోర్సులు, ఒలింపియాడ్ల పేరుతో లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, బూట్లు తదితర వస్తువులను కూడా పాఠశాల ద్వారానే కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు.
అలాగే, విద్యా అర్హతలు లేని ఉపాధ్యాయులతో బోధన కొనసాగుతోందని, ఫీజుల వివరాలను పాఠశాల ప్రాంగణంలో ప్రదర్శించకుండా ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. ఈ అంశాలపై స్థానిక విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
అధికారులు వెంటనే విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో విద్యాశాఖ కార్యాలయం ఎదుట పెద్దఎత్తున ఉద్యమం చేపడతామని పీడీఎస్ఓ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి శివతో పాటు దస్తగిరి, రంగన్న, రాము, సాయి, రంగస్వామి, వీరేష్, అంజి, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్లు