అంతర్‌జిల్లా బైక్‌ దొంగల ముఠా గుట్టురట్టు.. 52 వాహనాల స్వాధీనం

అంతర్‌జిల్లా బైక్‌ దొంగల ముఠా గుట్టురట్టు.. 52 వాహనాల స్వాధీనం
నాగర్‌కర్నూల్, జులై 18 (ఎస్‌బి న్యూస్): నాగర్‌కర్నూల్–బిజినేపల్లి పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో అంతర్‌జిల్లా బైక్‌ దొంగల ముఠా గుట్టురట్టైంది. ఈ కేసులో జోంగం యాదయ్య, కృష్ణరాజు అలియాస్‌ శివకుమార్‌, చరణ్‌కుమార్‌ అలియాస్‌ శరత్‌ను పోలీసులు అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 52 మోటార్‌సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాకు ప్రధాన సూత్రధారిగా ఉన్న సంతోష్‌ నాయక్‌ ప్రస్తుతం మహబూబ్‌నగర్‌ జైలులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

పోలీసుల విచారణలో మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి 20, సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధి నుంచి 14, హైదరాబాద్‌ నుంచి 4, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాల నుంచి తలా 3 చొప్పున, నాగర్‌కర్నూల్‌, బిజినేపల్లి ప్రాంతాల్లో చోరీకి గురైన మోటార్‌సైకిళ్లను రికవరీ చేసినట్లు వెల్లడించారు. మంగానూర్‌ ప్రాంతంలో 36 దొంగ బైకులను విక్రయించినట్లు దర్యాప్తులో గుర్తించారు.

తక్కువ ధరలకు దొంగిలించిన వాహనాలను కొనుగోలు చేసిన వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. కేసును సమర్థవంతంగా ఛేదించిన సీఐ అశోక్‌రెడ్డి, ఎస్‌ఐలు గోవర్ధన్‌, శంషుద్దీన్‌తో పాటు పోలీసు బృందాన్ని ఎస్పీ అభినందించి, వారి పనితీరును ప్రశంసించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు