మౌలిక వసతులపై సమగ్ర పరిశీలన చేసిన ఐటీడీఏ ఏపీఓ జనరల్ డేవిడ్ రాజ్
మణుగూరు, జూన్ 9: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశాల మేరకు మణుగూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు, విద్యా సదుపాయాలపై ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి (ఏపీఓ) జనరల్ డేవిడ్ రాజ్ మంగళవారం సమగ్ర పరిశీలన నిర్వహించారు. కళాశాలలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను పరిశీలించి, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరింత మెరుగైన వాతావరణాన్ని కల్పించేందుకు అవసరమైన చర్యలపై అధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ నాగప్రసాద్తో సమావేశమైన డేవిడ్ రాజ్, విద్యార్థుల అవసరాలు, భవిష్యత్లో అవసరమయ్యే సదుపాయాల గురించి వివరాలు తెలుసుకున్నారు. కళాశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం, ఓపెన్ షెడ్డులో ల్యాబ్ ఏర్పాటు, ప్రత్యేక ల్యాబ్ భవనం నిర్మాణం, విద్యుత్ సౌకర్యాల మెరుగుదల, విద్యార్థుల కోసం క్రీడా మైదానం అభివృద్ధి, తరగతి గదుల్లో డ్యూయల్ డెస్క్ బల్లల ఏర్పాటు వంటి అంశాలను ప్రిన్సిపాల్ ఆయన దృష్టికి తీసుకువచ్చారు.
అలాగే బీటీపీఎస్ సంస్థ రూ.1.45 కోట్ల వ్యయంతో ల్యాబ్కు అవసరమైన ఆధునిక పరికరాలు, మెటీరియల్ అందించనున్న నేపథ్యంలో వాటిని సమర్థవంతంగా వినియోగించేందుకు తగిన ల్యాబ్ భవనం నిర్మాణం అత్యవసరమని వివరించారు. విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్య అందించాలంటే మౌలిక వసతుల అభివృద్ధి కీలకమని పేర్కొన్నారు.
ఈ అంశాలన్నింటినీ పరిశీలించిన డేవిడ్ రాజ్, సంబంధిత ప్రతిపాదనలను పూర్తిస్థాయిలో సిద్ధం చేసి ఐటీడీఏ కార్యాలయానికి సమర్పించాలని ఏఈ ప్రసాద్కు ఆదేశించారు. అనంతరం ఈ నివేదికలను జిల్లా కలెక్టర్కు పంపించి కళాశాల అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టేలా చూస్తామని తెలిపారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రైవేట్ విద్యాసంస్థలకు ఏమాత్రం తీసిపోని సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
అనంతరం సాంబాయిగూడెం గ్రామంలోని చేపల చెరువుకు సంబంధించిన సహకార సంఘాన్ని ఆయన తనిఖీ చేశారు. సంఘ కార్యకలాపాలు, రికార్డుల నిర్వహణ, మార్కెటింగ్ విధానాలపై సభ్యులతో మాట్లాడారు. చేపల మార్కెటింగ్కు అవసరమైన పరికరాలు, వెయింగ్ మిషన్లు కొనుగోలు చేసి వాటిని సక్రమంగా వినియోగించాలని సూచించారు. అలాగే సంఘానికి సంబంధించిన లావాదేవీలు, రికార్డులను పారదర్శకంగా నిర్వహించడం ద్వారా మెరుగైన ఆదాయం పొందవచ్చని సభ్యులకు వివరించారు.
సహకార సంఘాల బలోపేతం ద్వారా గ్రామీణ ప్రజల జీవనోపాధి మెరుగుపడుతుందని పేర్కొన్న డేవిడ్ రాజ్, సభ్యులు ఐకమత్యంతో పనిచేసి లాభాలను పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఎఫ్డీసీ ఉదయ్కుమార్, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ నాగప్రసాద్, ఏఈ ప్రసాద్, ఆర్ఐ రాధాగోపి తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ పరిశీలనతో పాలిటెక్నిక్ కళాశాల అభివృద్ధికి కొత్త ఊతం లభించే అవకాశం ఉందని విద్యార్థులు, అధ్యాపకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
0 కామెంట్లు