పోరాటాల ద్వారానే కార్మికులు హక్కులను సాధించుకోవాలి: ఐఎఫ్టీయూ

పోరాటాల ద్వారానే కార్మికులు హక్కులను సాధించుకోవాలి: ఐఎఫ్టీయూ నాయకులు
హోలగుంద, జూన్ 7: కర్నూలు జిల్లా హోలగుంద మండలం ముద్దటమాగి గ్రామంలో ఆదివారం రాయలసీమ ప్రగతిశీల లోడింగ్ అన్‌లోడింగ్ హమాలీ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టీయూ అనుబంధం) ఆధ్వర్యంలో హమాలీ కార్మికుల జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. బీరప్ప దేవాలయ ప్రాంగణంలో జరిగిన ఈ సమావేశానికి ఐఎఫ్టీయూ జిల్లా కమిటీ సభ్యుడు నరసన్న అధ్యక్షత వహించారు.

సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఐఎఫ్టీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు బి. సురేష్, సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి మల్లికార్జున, ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి జి. వెంకప్ప, ప్రగతిశీల మహిళా సంఘం (పీఓడబ్ల్యూ) జిల్లా కార్యదర్శి మణి మాట్లాడుతూ హమాలీ కార్మికులు దేశ సంపద సృష్టిలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, వారి సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు.
అసంఘటిత రంగ కార్మికులు తమ శ్రమపైనే కుటుంబాలను పోషించుకుంటున్నారని, వారికి సరైన వేతనాలు, కార్మిక చట్టాల అమలు, సామాజిక భద్రత అందడం లేదన్నారు. హమాలీ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

దేశవ్యాప్తంగా హమాలీ కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, పీఎఫ్, ఈఎస్ఐ, ఆరోగ్య బీమా, 60 ఏళ్లు పూర్తయిన వారికి నెలవారీ పెన్షన్, కార్మికుడు మరణిస్తే కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికులు తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని నాయకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో హోలగుంద మండల ఐఎఫ్టీయూ కార్యదర్శి సౌరప్ప, కమిటీ సభ్యులు దేవన్న, బసప్ప, ఈరన్న, మల్లప్ప తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు