నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు: డీఎంహెచ్వో తూకారం రాథోడ్
గుండాల, జూన్ 19: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింత చాట్ల వనజ, నవజాత శిశువు మృతి ఘటనపై నిష్పాక్షికంగా విచారణ నిర్వహించి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్వో) తూకారం రాథోడ్ తెలిపారు.
గుండాల మండలం శంభునిగూడెం గ్రామానికి చెందిన చాట్ల వనజ (20) పురిటినొప్పులతో గుండాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేరగా, ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో స్టాఫ్ నర్సు ఆధ్వర్యంలో సాధారణ ప్రసవం నిర్వహించినట్లు సమాచారం. ప్రసవం అనంతరం ఆడ శిశువు మృతి చెందగా, తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న వనజను మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆమె కూడా మృతి చెందింది.
ఈ ఘటన మరింత వివాదాస్పదంగా మారడానికి కారణం, వనజ అంత్యక్రియల అనంతరం కుటుంబ సభ్యులు చితాభస్మాన్ని సేకరిస్తున్న సమయంలో అందులో సర్జికల్ కత్తెర బయటపడటమే. దీంతో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తాము ఎలాంటి శస్త్రచికిత్స చేయలేదని, సాధారణ ప్రసవమే నిర్వహించామని ఆసుపత్రి సిబ్బంది చెబుతున్నారు.
బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదులు, ప్రజా ఆందోళనల నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ స్పందించింది. ప్రాథమికంగా బాధ్యత వహించాల్సిన గుండాల వైద్యాధికారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో డీఎంహెచ్వో తూకారం రాథోడ్, డీసీహెచ్ డాక్టర్ రవిబాబు శనివారం గుండాలకు చేరుకుని బాధిత కుటుంబ సభ్యులతో పాటు ఆసుపత్రి సిబ్బందిని విచారించారు. ఘటనకు సంబంధించిన పూర్తి నివేదికను జిల్లా కలెక్టర్, రాష్ట్ర ఆరోగ్య శాఖ కమిషనర్కు అందజేస్తామని తెలిపారు.
విచారణ నివేదికలో తేలే అంశాల ఆధారంగా బాధ్యులైన ఇతర సిబ్బందిపై కూడా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణ కొనసాగుతోంది.
0 కామెంట్లు