ఆశయాల సాధనకు ఉద్యమిద్దాం
జూన్ 1న తూరుబాకలో స్మారక స్థూపం, విగ్రహావిష్కరణ సభను జయప్రదం చేయండి: సీపీఎం నాయకుల పిలుపు
గుండాల మండలం జూన్ 1 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి
గుండాల మండల ప్రజా ఉద్యమాల నేత, ఆదివాసీల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన అమరజీవి జోగ నర్సయ్య ఐదో వర్ధంతి సందర్భంగా జూన్ 1న తూరుబాక గ్రామంలో నిర్వహించే స్మారక స్థూపావిష్కరణ, విగ్రహావిష్కరణ సభను విజయవంతం చేయాలని సీపీఎం నాయకులు పిలుపునిచ్చారు. ఆదివాసీ కుటుంబంలో జన్మించిన జోగ నర్సయ్య చిన్ననాటి నుంచే ప్రజా సమస్యల పట్ల చైతన్యం పెంపొందించుకుని కమ్యూనిస్టు భావజాలానికి ఆకర్షితుడయ్యారు. విద్యార్థి దశ నుంచే ప్రజా ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్న ఆయన, గిరిజనుల భూ హక్కులు, విద్య, ఉపాధి, సంక్షేమం కోసం నిరంతర పోరాటాలు సాగించారు. జిల్లాస్థాయి కబడ్డీ క్రీడాకారుడిగా గుర్తింపు పొందిన నర్సయ్య, అనంతరం ప్రజా నాయకుడిగా ఎదిగి గుండాల మండల ప్రజల మన్ననలు పొందారు. 1998లో తుడుందెబ్బ ఉద్యమ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ఆయన, జీఓ నంబర్--3 అమలు, పోడు భూముల హక్కుల సాధన కోసం గ్రామాలన్నింటిలో సైకిల్ యాత్ర నిర్వహించారు. ఆదివాసీ విద్యార్థి సంఘాల నిర్మాణంలో కృషి చేయడంతో పాటు గుండాలలో జూనియర్ కళాశాల, ఎస్ఎంహెచ్ హాస్టల్ ఏర్పాటుకు ఉద్యమించి ఫలితాలు సాధించారు. 2007లో సీపీఎం సభ్యత్వం స్వీకరించిన జోగ నర్సయ్య పార్టీ పిలుపు మేరకు ఆదివాసీలు, రైతులు, కూలీల సమస్యలపై అనేక పోరాటాలకు నాయకత్వం వహించారు. పోడు భూముల సాగుదారులపై అటవీశాఖ వేధింపులను అరికట్టాలని, తునికాకు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని నిరంతరం ఉద్యమాలు చేపట్టారు. సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల విస్తరణకు వ్యతిరేకంగా గ్రామగ్రామాన ప్రజలను చైతన్యపరిచి అఖిలపక్షాలను ఐక్యం చేసి పోరాటాలు నిర్వహించారు. గుండాల మండల కేంద్రంలో కొమరం భీం విగ్రహ స్థాపన కోసం విశేష కృషి చేసి విజయవంతం చేశారు. అటవీ హక్కుల చట్టం అమలు కోసం కూడా ఆయన విశేషంగా పోరాడారని నాయకులు పేర్కొన్నారు. గిరిజనులు, పేదలు తమ భూములపై హక్కులు పొందడంలో అటవీ హక్కుల చట్టం కీలకమైందని, ఆ చట్టాన్ని సమర్థంగా అమలు చేయాలని జోగ నర్సయ్య ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు జరిగాయని గుర్తుచేశారు. కరోనా మహమ్మారి సమయంలో 2021 మే 22న జోగ నర్సయ్య ఆకస్మికంగా మృతిచెందడం ఉద్యమాలకు తీరని లోటని పేర్కొన్నారు. ప్రజల కోసం జీవించిన ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం ద్వారానే నిజమైన నివాళి అర్పించినవారమవుతామని అన్నారు. జూన్ 1న తూరుబాక గ్రామంలో నిర్వహించే స్మారక స్థూపావిష్కరణ, విగ్రహావిష్కరణ సభకు ఆదివాసీలు, రైతులు, కూలీలు, ప్రజాసంఘాల నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని సీపీఎం నాయకులు కోరారు.
0 కామెంట్లు