భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాక గ్రామపంచాయతీలో రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించేందుకు గ్రామసభ నిర్వహించారు. ఈ సమావేశానికి సర్పంచ్ గుగులోత్ కిషోర్ శివరాం నాయక్ అధ్యక్షత వహించగా, ఎస్ఐ మేడ ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
గ్రామసభలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, సారపాక ప్రాంతంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు తక్షణ చర్యలు అవసరమని తెలిపారు. ఐటిసి బిపిఎల్ నుంచి భద్రాచలం బ్రిడ్జి వరకు రహదారి రెండు వైపులా వాహనాలు ఆపకుండా నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించారు.
అలాగే యువతలో గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగం పెరుగుతోందని, అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వారిని సరిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. సారపాక మెయిన్ సెంటర్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, రద్దీ సమయాల్లో ఒక కానిస్టేబుల్ను విధుల్లో ఉంచాలని డిమాండ్ చేశారు.
ప్రత్యేకంగా ఐటిసి బిపిఎల్ కంపెనీ షిఫ్ట్ మార్పుల సమయంలో ఉదయం, సాయంత్రం వేళల్లో భారీ రద్దీ నెలకొంటుందని, ఆ సమయంలో ట్రాఫిక్ నియంత్రణకు పోలీసుల సహకారం అవసరమని పేర్కొన్నారు. అదేవిధంగా, ప్రాంతంలో పెరుగుతున్న దొంగతనాలను అరికట్టేందుకు రాత్రి పూట పెట్రోలింగ్ను పెంచాలని కోరారు.
ఈ సందర్భంగా ఎస్ఐ మేడ ప్రసాద్ మాట్లాడుతూ, అవసరమైన ప్రాంతాల్లో పోలీస్ సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
సర్పంచ్ గుగులోత్ కిషోర్ శివరాం నాయక్ మాట్లాడుతూ, గ్రామాభివృద్ధి మరియు భద్రత కోసం పోలీసులతో సమన్వయం కొనసాగిస్తామని తెలిపారు. సిపిఎం పార్టీ తరఫున కూడా పూర్తిస్థాయి సహకారం అందిస్తామని నాయకులు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
0 కామెంట్లు