పినపాక
పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రభుత్వ పథకాలను ప్రజలకు సమర్థంగా చేరవేయడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. గురువారం పినపాక మండలం ఈ బయ్యారం క్రాస్ రోడ్లోని జివిఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమీక్ష సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లక్ష్యం ప్రతి అర్హుడైన లబ్ధిదారునికి ప్రయోజనం చేరేలా చేయడమేనని అన్నారు. అయితే, పథకాలపై పూర్తి అవగాహన లేకపోవడం వల్ల కొంతమంది అధికారులు సక్రమంగా అమలు చేయడంలో విఫలమవుతున్నారని పేర్కొన్నారు. అధికారులు తమ శాఖల పరిధిలో ఉన్న పథకాలపై పూర్తిగా అవగాహన పెంపొందించుకుని, వాటిని ప్రజలకు చేరువ చేయడంలో బాధ్యతగా వ్యవహరించాలని ఆయన సూచించారు.
సమీక్ష సమావేశంలో వివిధ శాఖల అధికారులను అడిగి ఆయా శాఖల్లో అమలవుతున్న పథకాల అమలు పరిస్థితులు, లబ్ధిదారుల వివరాలు, ఎదురవుతున్న సమస్యలను ఎమ్మెల్యే తెలుసుకున్నారు. ముఖ్యంగా విద్య, ఆరోగ్యం, విద్యుత్, వ్యవసాయం, సంక్షేమ శాఖల పనితీరును సమీక్షిస్తూ, ఎక్కడైనా లోపాలు ఉన్నా వెంటనే సరిచేయాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల లబ్ధి అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
అనంతరం కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ఎమ్మెల్యే వివరించారు. పేదల సంక్షేమం, విద్యాభివృద్ధి, ఆరోగ్య పరిరక్షణ, మహిళా సాధికారత వంటి అంశాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఈ పథకాలను ప్రజలకు మరింత విస్తృతంగా చేరవేసే బాధ్యత అధికారులతో పాటు ప్రజాప్రతినిధులపై కూడా ఉందని అన్నారు.
ప్రజల సమస్యలను సమయానికి పరిష్కరించడం ద్వారా ప్రభుత్వంపై నమ్మకం పెరుగుతుందని, అందుకు ప్రతి అధికారి కట్టుబడి పనిచేయాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సూచించారు. అనంతరం అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. ఈ సమావేశంలో మండల స్పెషల్ ఆఫీసర్ తాతారావు, తాసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీవో వెంకటేశ్వరరావు, ఏపీవో వీరభద్రస్వామి, ఏవో వెంకటేశ్వర్లు, ఎస్ఐ సురేష్, ఎంఈఓ నాగయ్య, భగీరథ ఎఈ ప్రవీణ్ ,వివిధ శాఖల ఏఈలు, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రామనాథం,23 గ్రామ పంచాయతీల సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, మండల ప్రజలు , కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు, సంక్షేమ పథకాల లబ్ధిదారులు పాల్గొన్నారు.
0 కామెంట్లు