కరకగూడెం మండలంలోని తాటిగూడెం మరియు అనంతారం గ్రామాల్లో దేశీ విత్తనాల సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ సీడ్ బ్యాంక్ స్థాపనపై శిక్షణ కార్యక్రమం ఈ రోజు విజయవంతంగా నిర్వహించబడింది. గ్రామీణ రైతులకు దేశీ విత్తనాల ప్రాముఖ్యతను తెలియజేసి, సంప్రదాయ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
తాటిగూడెం గ్రామ సర్పంచ్ కే. విజయలక్ష్మి మరియు గ్రామ కార్యదర్శి వీరన్న ఈ కార్యక్రమంలో పాల్గొని దేశీ విత్తనాల సీడ్ బ్యాంక్ను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, రైతులు, స్వయం సహాయక సంఘాల మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్గా పాల్గొన్న భాస్కర్ దేశీ విత్తనాల గొప్పతనం, వాటి ఉపయోగాలు మరియు ప్రస్తుత కాలంలో వాటి అవసరాన్ని వివరించారు. రసాయనాలపై ఆధారపడని సహజ వ్యవసాయానికి దేశీ విత్తనాలు ఎంతో ఉపయుక్తమని ఆయన పేర్కొన్నారు. “మన ఊరు – మన విత్తనం” అనే నినాదంతో ప్రకృతికి అనుగుణంగా సాగు చేస్తే ఆరోగ్యకరమైన ఆహారం ఉత్పత్తి అవుతుందని, రైతులకు మంచి దిగుబడి లభిస్తుందని ఆయన వివరించారు. అలాగే CONARE–BRLF–HDFC సంస్థలు గ్రామీణ ప్రాంతాల్లో దేశీ విత్తనాల పరిరక్షణ కోసం చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు.
ఈ సందర్భంగా లైవ్లీహుడ్ ఎక్స్పర్ట్ ప్రణయ శ్రీ మంగళి మాట్లాడుతూ, సీడ్ బ్యాంక్లో ప్రస్తుతం సుమారు 30 రకాల దేశీ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కరకగూడెం మండలంలోని రైతులందరూ ఈ విత్తనాలను కొనుగోలు చేసి తమ వ్యవసాయంలో వినియోగించుకోవచ్చని చెప్పారు. ఈ విధంగా దేశీ విత్తనాలను వినియోగించడం వల్ల ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని కొనసాగించవచ్చని, రైతులు సంప్రదాయ వ్యవసాయ పద్ధతులను తిరిగి ఆచరించాల్సిన అవసరం ఉందని సూచించారు.
ఈ కార్యక్రమంలో సీడ్ బ్యాంక్కు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలు, క్లస్టర్ కోఆర్డినేటర్ స్వాతి, సీఆర్పీలు నరేష్, రస్మా, హైమావతి పాల్గొన్నారు. అదేవిధంగా కరకగూడెం మండలం ఆదివాసి జేఏసీ చైర్మన్ వెంకటనారాయణ కూడా కార్యక్రమంలో హాజరై రైతులను ప్రోత్సహించారు.
కోనేరు సంస్థ డైరెక్టర్ శ్రీ ఎం.ఏ. సలీం మరియు మండల కోఆర్డినేటర్ పి. వెంకటేష్ తమ సలహాలు, సూచనలు అందిస్తూ కార్యక్రమం విజయవంతంగా సాగేందుకు సహకరించారు. ఈ సీడ్ బ్యాంక్ ఏర్పాటుతో రైతులకు దేశీ విత్తనాలు సులభంగా అందుబాటులోకి రావడంతో పాటు, సంప్రదాయ వ్యవసాయ పద్ధతుల పరిరక్షణకు ఇది ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు.
0 కామెంట్లు