మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ

నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 07 (ఎస్‌బి న్యూస్):
నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, డీసీసీ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని 9వ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థి సుంకరి అలివేల (లక్ష్మీ) రాజేష్ గౌడ్కు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వాన్ని మరింత బలోపేతం చేయాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. 9వ వార్డు సభ్యురాలిగా సుంకరి అలివేల (లక్ష్మీ) రాజేష్ గౌడ్ గెలిస్తే, స్థానిక వార్డు సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించగలరని విశ్వాసం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలు అమల్లోకి తీసుకువచ్చి ప్రజలకు అందజేస్తున్నామని తెలిపారు. నాగర్‌కర్నూల్ పట్టణంలో డ్రైనేజ్ వ్యవస్థ, రహదారులు, తాగునీటి సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు.
నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అన్ని వార్డు కౌన్సిలర్లను గెలిపించి మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలని పట్టణ ప్రజలను కోరారు. నాగర్‌కర్నూల్ జిల్లా మున్సిపల్ ఎన్నికల ఇన్‌చార్జిగా తనను నియమించినందుకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
పోలింగ్ ఫిబ్రవరి 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని, ప్రతి ఓటరు తమ అమూల్యమైన ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్, అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, మార్కెట్ కమిటీ చైర్మన్ అంతటి రజిత మల్లేష్, నాగర్‌కర్నూల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు