అశ్వాపురం మండలం ఫిబ్రవరి 28 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి:
అశ్వాపురం లోని ఎక్స్ లెంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో శనివారం జాతీయ విజ్ఞాన దినోత్సవం (సైన్స్ డే) వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రాంగణం మొత్తం శాస్త్రీయ ఆవిష్కరణలతో కళకళలాడింది. విద్యార్థులు తమ సృజనాత్మకత, పరిశోధనా తపన, విజ్ఞాన నైపుణ్యాలను ప్రదర్శిస్తూ రూపొందించిన పరికరాలు అందరినీ ఆకట్టుకున్నాయి.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ లెనిన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ, భారతదేశ గర్వకారణమైన శాస్త్రవేత్త సివి రామన్ రామన్ ఎఫెక్ట్ ను కనుగొన్న ఫిబ్రవరి 28వ తేదీని జాతీయ విజ్ఞాన దినోత్సవంగా జరుపుకుంటామని తెలిపారు. శాస్త్రవిజ్ఞానం మన జీవితాన్ని మారుస్తుందని, విద్యార్థులు చిన్న వయస్సులోనే పరిశోధనా దృక్పథాన్ని అలవరచుకోవాలని సూచించారు. విజ్ఞానం అంటే కేవలం పుస్తక పాఠాలు మాత్రమే కాకుండా, ఆచరణలో ప్రయోగాలు చేయడం, సమస్యలకు పరిష్కారాలు కనుగొనడమేనని ఆయన అన్నారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్లో విద్యార్థులు తయారుచేసిన పలు వైజ్ఞానిక పరికరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సోలార్ ఎనర్జీ ఆధారిత గృహ నమూనా,వర్షపు నీటి సంరక్షణ మోడల్,అగ్నిప్రమాదాల నివారణకు అలారం వ్యవస్థ, సింపుల్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ నమూనాలు, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే ప్రదర్శనలు సందర్శకులను అబ్బురపరిచాయి. చిన్నారులు సైన్స్ సూత్రాలను స్పష్టంగా వివరిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో సైన్స్ ఉపాధ్యాయురాలులు విద్యార్థులకు అందించిన మార్గదర్శకత విశేషంగా నిలిచింది. పాఠ్యాంశాల్లోని సైన్స్ సూత్రాలను సులభంగా అర్థమయ్యే విధంగా బోధించి, ప్రతి విద్యార్థి ఒక ప్రాజెక్ట్ రూపొందించేలా ప్రోత్సహించారు. పరికరాల తయారీలో అవసరమైన సామగ్రి ఎంపిక నుండి ప్రదర్శన వరకు ప్రతి దశలో సహకరించి, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు కృషి చేశారు. పుస్తకాల్లో నేర్చుకున్న పాఠాలను చేతికందే ప్రయోగాలుగా మార్చితేనే అసలు విజ్ఞానం వస్తుంది అని విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయురాలులు తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్లు