విద్యారంగ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా పోరాటాలు ఉధృతం చేస్తాం

విద్యారంగ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా పోరాటాలు ఉధృతం చేస్తాం
ఏఐఎస్ఎఫ్ నాగర్ కర్నూల్ జిల్లా రెండవ మహాసభలో నరేష్, ప్రేమ్ కుమార్ ఎన్నిక
నాగర్ కర్నూల్, ఫిబ్రవరి 08 (ఎస్‌బి న్యూస్):
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో శనివారం ఏఐఎస్ఎఫ్ నాగర్ కర్నూల్ జిల్లా రెండవ మహాసభ ఘనంగా నిర్వహించారు. ఈ మహాసభలో జిల్లా అధ్యక్షుడిగా నరేష్‌ను, జిల్లా కార్యదర్శిగా బలముల ప్రేమ్ కుమార్‌ను ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. వీరితో పాటు ఐదుగురు జిల్లా కార్యవర్గ సభ్యులు, 15 మంది జిల్లా సమితి సభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ నాగర్ కర్నూల్ జిల్లాలో విద్యారంగాన్ని పాలకులు ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తున్నారని తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు మౌలిక వసతుల లేమితో అస్తవ్యస్తంగా మారాయని, ఉపాధ్యాయుల కొరత కారణంగా తరగతులు సక్రమంగా జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమని అన్నారు.
స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లు నెలల తరబడి బకాయిలుగా మారడంతో వేలాది మంది పేద విద్యార్థులు చదువులు మానుకునే పరిస్థితి ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వసతి గృహాల్లో తాగునీరు, భోజనం, పరిశుభ్రత వంటి కనీస సదుపాయాలు కూడా లేవని, దీనివల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ప్రైవేటు విద్యాసంస్థలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తూ విద్యను వ్యాపారంగా మార్చుతున్నాయని, వాటిని నియంత్రించాల్సిన ప్రభుత్వం కార్పొరేట్ విద్యా మాఫియాకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, నోటిఫికేషన్ల పేరుతో విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు.
మాపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించిన మహాసభ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలుపుతూ, నాగర్ కర్నూల్ జిల్లాలో విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం సమరశీల ఉద్యమాలను మరింత ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు. అవసరమైతే జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలకు పిలుపునిస్తామని హెచ్చరించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల పక్షాన చివరి వరకు పోరాడే ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ మాత్రమేనని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు అనుష, ప్రేమలత, బాలాజీ, శిరీష, అర్జున్, నరేష్, భాను ప్రసాద్, వెంకటేష్, సరితతో పాటు కార్యకర్తలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు