గుండాల, ఫిబ్రవరి 18 (స్వాతంత్ర్య భారత్ ప్రతినిధి)
గుండాల మండలం కేంద్రంలో మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న ఆదివాసి మహిళా రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని తుడుం దెబ్బ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు జవ్వాజి లక్ష్మీనారాయణ విగ్రహం వద్ద సదస్సు పోస్టర్ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా తుడుం దెబ్బ జాతీయ కన్వీనర్ రమణాల లక్ష్మయ్య మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా మహిళలకు సమాన హక్కులు కల్పించేందుకు ఐక్యరాజ్యసమితి కృషి చేస్తోందన్నారు. భారత రాజ్యాంగం స్త్రీ–పురుష సమానత్వాన్ని ప్రాథమిక హక్కుగా గుర్తించినప్పటికీ, ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసి మహిళలు ఇంకా వివక్షను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యవసాయం, కూలి పనులు, పోడు సాగు వంటి రంగాల్లో మహిళలు పురుషులతో సమానంగా శ్రమిస్తున్నప్పటికీ, తండ్రి ఆస్తిపై కుమార్తెలకు సమాన హక్కులు అమలులో లేవని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మహిళలకు వారసత్వ హక్కులు, భూమిపై సమాన హక్కులు కల్పించాలనే డిమాండ్తో ఈ సదస్సు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
ప్రతి మండలం, ప్రతి గ్రామం నుంచి ఆదివాసి మహిళలు తండోపతండాలుగా హాజరై మార్చి 8, 2026 (ఆదివారం) జరిగే రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గ్రామ పెద్దలు, యువత మహిళలను స్వేచ్ఛగా పాల్గొనేలా ప్రోత్సహించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గుంపిడి వెంకటేశ్వర్లు, వట్టం కన్నయ్య, పూనెం శ్రీను, వర్ష శ్రీను, చింత వెంకటేశ్వర్లు, వజ్జ ఎర్రయ్య, కల్తి మల్లయ్య, గోవింద నరసింహారావు, మోకాళ్ళ మహేందర్, సూర్ణపాక నరసయ్య (దాసు), ఈసం కృష్ణ తదితర నాయకులు పాల్గొన్నారు.
0 కామెంట్లు