పురుగులున్న అన్నం పెడుతున్నారని రోడ్డెక్కిన గురుకుల విద్యార్థినులు

తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలో ఉన్న గురుకుల పాఠశాలలో పురుగులున్న అన్నం వడ్డిస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థినులు బుధవారం ఆందోళన చేపట్టారు.
మెనూ ప్రకారం భోజనం అందించకుండా నాసిరకం ఆహారం పెడుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యపై పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని పేర్కొన్నారు. దీంతో మంగళవారం శ్రీశైలం–హైదరాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.ఆందోళన సమయంలో నలుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురికాగా, వారిని సమీప ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
పాఠశాల ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయులు విద్యార్థినులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
సమాచారం అందుకున్న ఎమ్మార్వో, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విద్యార్థినులతో చర్చలు జరిపారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు