అద్వాన దుస్థితిలో గుండాల - మణుగూరు ప్రధాన రహదారి

అద్వాన దుస్థితిలో గుండాల - మణుగూరు ప్రధాన రహదారి

ఆదమరిస్తే అంతే సంగతులు

 తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్

*గుండాల మండలం ఫిబ్రవరి 4 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి*

గుండాల నుండి మణుగూరు వెళ్లే ప్రధాన రహదారి సాయనపల్లి గ్రామ శివారు ప్రాంతంలో వర్షాకాలం అనంతరం తీవ్రంగా దెబ్బతింది. రహదారి అంతటా లోతైన గోతులు, కూలిపోయిన అంచులు, నీరు నిలిచే ప్రదేశాలు ఏర్పడి ప్రయాణికులకు పెను ప్రమాదంగా మారాయి. ఇంతవరకు సంబంధిత అధికారులు ఈ సమస్యను గమనించి చర్యలు తీసుకోకపోవడం పట్ల స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏమాత్రం ఏమరపాటు జరిగినా ప్రాణనష్టం సంభవించే పరిస్థితి ఉందని వారు హెచ్చరిస్తున్నారు.

స్థానికులు పలుమార్లు స్థానిక అధికారులకు ఫిర్యాదు చేయగా, R&B అధికారులకు సమాచారం ఇచ్చామని, రెండు మూడు రోజుల్లో పనులు చేపడతామని హామీ ఇచ్చారని తెలిపారు. అయితే ఆ హామీలు మాటలకే పరిమితమయ్యాయని, ఇప్పటివరకు ఎలాంటి మరమ్మతులు జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేడారం జాతర సమయంలో రోడ్లపై పేరుకుపోయిన చెత్తను జాతర ప్రత్యేక నిధులతో శుభ్రం చేసినప్పటికీ, ప్రమాదకరంగా ఉన్న గోతుల్లో తట్టేడు మట్టి కూడా వేయకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమని స్థానికులు విమర్శిస్తున్నారు.

ఈ రహదారి మీదుగా మణుగూరు నుంచి గుండాలకు నిత్యం బస్సు రాకపోకలు సాగుతాయి. అలాగే విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు పెద్ద సంఖ్యలో ఈ మార్గాన్నే ఆశ్రయిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే భారీగా జననష్టం సంభవించే అవకాశం ఉందని ఆదివాసీ సంక్షేమ పరిషత్ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు వి.సి. దొర ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే రహదారి మరమ్మతులు చేపట్టి, గోతులు పూడ్చి, రహదారిని సురక్షితంగా మారుస్తూ ప్రజల ప్రాణాలను కాపాడాలని ఆయన సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు. సమస్యను నిర్లక్ష్యం చేస్తే ఉద్యమాలకు దిగుతామని కూడా హెచ్చరించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు