రోడ్డు ప్రమాదాలను నివారించి ప్రజల ప్రాణాలను కాపాడటమే ప్రధాన లక్ష్యంగా రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం పినపాక మండలం ఐలాపురం క్రాస్ రోడ్డు వద్ద శుక్రవారం నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి హాజరై మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా నిర్లక్ష్యం, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన వల్లే జరుగుతున్నాయని అన్నారు.
వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీట్బెల్ట్ ధరించాలన్నారు. మద్యం సేవించి వాహనం నడపడం అత్యంత ప్రమాదకరమని, ఇది కేవలం వాహనదారుడికే కాదు ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పుగా మారుతుందని హెచ్చరించారు. వేగ నియంత్రణ పాటించడం, మొబైల్ ఫోన్ ఉపయోగించకుండా వాహనం నడపడం వంటి అంశాలు ప్రమాదాల నివారణలో కీలకమని వివరించారు. ముఖ్యంగా యువత ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంచుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్ఐ సురేష్ మాట్లాడుతూ, రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు. పాదచారులు కూడా జాగ్రత్తలు పాటించాలని, రోడ్డు దాటేటప్పుడు రోడ్డు ఇరువైపులా చూసుకొని దాటాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ నియమాలు పాటించడం అవసరమని అన్నారు.
భూపాలపట్నం సర్పంచ్ స్వప్న మాట్లాడుతూ, గ్రామస్థాయిలోనూ రోడ్డు భద్రతపై విస్తృత ప్రచారం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పొట్లపల్లి సర్పంచ్ మద్దెల సమ్మయ్య, గడ్డంపల్లి సర్పంచ్ పడిగా కృష్ణవేణి మాట్లాడుతూ, స్థానిక సంస్థలు పోలీస్ శాఖతో కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు.
ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, మీడియా కూడా రోడ్డు భద్రతపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాలన్నారు. నిత్యం ప్రమాదాలపై వార్తలు ప్రచురించడంతో పాటు నివారణ చర్యలపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉందని చెప్పారు.
అనంతరం ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులతో మాట్లాడించారు. రోడ్డు ప్రమాదాలలో ఒక వ్యక్తి మరణించడం అంటే ఆ కుటుంబం రోడ్డున పడ్డట్టే అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాధితులు కన్నీరు పెట్టుకుంటూ తమ ఆవేదన తెలియజేశారు. తమ కుటుంబంలో జరిగిన ఘటన ఇంకా ఏ కుటుంబంలో జరగవద్దని వారు ఈ సందర్భంగా తమ ఆవేదన ద్వారా తెలియజేశారు.
కార్యక్రమం ద్వారా రోడ్డు భద్రతపై ప్రజల్లో చైతన్యం పెరిగిందని నిర్వాహకులు తెలిపారు. రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తామని పోలీసులు వెల్లడించారు. అనంతరం డిఎస్పి రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు.ఈ అవగాహన సమావేశంలో స్థానిక ప్రజలు, వాహనదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
