Subscribe Us

SB LATEST:

22, జనవరి 2026, గురువారం

ఇక ఆన్లైన్ ద్వారానే ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక: భద్రాద్రి కలెక్టర్ జితేష్ వి పాటిల్

ఇకపై ఆన్లైన్ ద్వారానే ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక సరఫరా
-భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మన ఇసుక వాహనం పైలట్ ప్రాజెక్ట్ అమలు : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

కొత్తగూడెం జనవరి 22 (sb updates): తెలంగాణ రాష్ట్రంలో ఇసుక రవాణా, సరఫరా వ్యవస్థను పూర్తిగా పారదర్శకంగా, నియంత్రిత విధానంలో అమలు చేయాలనే స్పష్టమైన లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఇసుక వాహనం’ ఆన్లైన్ సాండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టిందని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. ఇసుక అక్రమ రవాణా, నిల్వలు,అవినీతి వంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే ఈ కొత్త విధాన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్న ఈ విధానాన్ని ముందుగా పైలట్ ప్రాజెక్ట్‌గా జిల్లాలో ప్రారంభించనున్నట్లు తెలిపారు.ఈ నేపథ్యం లో తెలంగాణ రాష్ట్ర గనులు & భూగర్భ శాఖ ఆధ్వర్యంలో, తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ టీజీఎండీసీ అధికారులు సంయుక్తంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న తహసిల్దార్లు, ఎంపిడివోలు, ఆర్డీవోలు, పంచాయతీ సెక్రటరీలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో ‘మన ఇసుక వాహనం’ ఆన్లైన్ వ్యవస్థ పని విధానం, ఇసుక బుకింగ్ విధానం, రవాణా అనుమతులు, జీపీఎస్ ట్రాకింగ్, చెల్లింపుల విధానం, ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియ వంటి అంశాలపై విస్తృతంగా వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇకపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక సరఫరా పూర్తిగా మన ఇసుక వాహనం ఆన్లైన్ సిస్టమ్ ద్వారానే జరుగుతుందని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇండ్లు, గృహ నిర్మాణ పనులు, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు సహా అన్ని అవసరాల కోసం మాన్యువల్ కూపన్లను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి అనుమతి, ప్రతి రవాణా, ప్రతి లావాదేవీ పూర్తిగా ఆన్లైన్ విధానంలోనే జరుగుతుందని, ఇందులో ఎలాంటి మానవ జోక్యం ఉండదని అన్నారు.మండలాల వారీగా ఇసుకకు ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా తక్షణమే ఇసుక లభ్యత ఉన్న రీచ్‌లను గుర్తించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. గుర్తించిన రీచ్‌ల వివరాలు, రవాణా సామర్థ్యం, రోజువారీ సరఫరా వివరాలను సమగ్రంగా ఏడి మైన్స్ కార్యాలయానికి నివేదించాలని సూచించారు. తద్వారా ఇసుక కొరత లేకుండా ప్రజలకు సకాలంలో సరఫరా చేయవచ్చని తెలిపారు.ఈ కొత్త విధానం సమర్థవంతంగా అమలవ్వాలంటే అన్ని స్థాయిల అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. తాసిల్దార్లు, ఎంపిడివోలు, ఆర్డీవోలు, పంచాయతీ సెక్రటరీలు సహా జిల్లా వ్యాప్తంగా ఉన్న అధికారులు ఈ వ్యవస్థపై పూర్తి స్థాయిలో శిక్షణ పొందారని, ఫీల్డ్ స్థాయిలో కూడా పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణా, నిల్వలు, ధరల పెంపు వంటి అంశాలపై కఠిన నియంత్రణ చర్యలు అమల్లోకి వస్తాయని హెచ్చరించారు.
ఈ ఆన్లైన్ సిస్టమ్ ద్వారా ప్రజలకు పారదర్శకంగా, వేగంగా, నమ్మకంగా, అవినీతి రహితంగా ఇసుక లభ్యత కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే, రాష్ట్రవ్యాప్తంగా ఇదే విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయనున్నట్లు తెలిపారు.ఈ అవగాహన సదస్సులో ఏడీ మైనింగ్ అధికారులు, పి ఓ –టీజీఎండీసీ , సీజీజీ(హైదరాబాద్) ప్రతినిధులు, మండల స్థాయి తహసిల్దార్లు (ఎమ్ ఆర్ ఓ లు), ఎంపిడివోలు (ఎంపీడీఓ లు ) తదితర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.