భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని సీతారామపురం వద్ద నిర్మితమవుతున్న మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ప్రాజెక్టులో అత్యంత కీలకమైన బాహుబలి మోటార్ అమరిక పనులను పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు మంగళవారం వేదమంత్రాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం పూర్తయిన అనంతరం ఈ ప్రాంత రైతుల సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతు అభివృద్ధి ద్వారానే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా వేలాది ఎకరాలకు సాగునీరు అందించి అశ్వాపురం మండలాన్ని సస్యశ్యామలం చేస్తామని, రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ సంకల్పమని తెలిపారు.
రాజీవ్ సాగర్ ప్రాజెక్టు ప్రారంభ సమయంలో ఎమ్మెల్యేగా ఉండడం, నేడు మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం పూర్తి దశకు చేరుకున్న సందర్భంలో కూడా ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు.
లెఫ్ట్ కెనాల్ ద్వారా ఆరు గ్రామపంచాయతీల పరిధిలోని సుమారు 12 వేలకుపైగా ఎకరాలకు, రైట్ కెనాల్ ద్వారా 10 చెరువులను నింపి దాదాపు 30 వేల ఎకరాలకు చివరి ఎకరం వరకు సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ కార్యనిర్వాహక ఇంజనీర్ టి. వెంకటేశ్వరరావు, ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ కె. శ్రీనివాస్, సహాయ కార్యనిర్వాహక ఇంజనీర్లు, ఎంఈఐఎల్ సిబ్బంది, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఓరుగంటి రమేష్ బాబు, గాదె కేశవరెడ్డి, ఆవుల రవి, వేములపల్లి రమేష్, ఉసా అనిల్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భూరెడ్డి వెంకటరెడ్డి, తుక్కాని మధు, గ్రామ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, రైతులు మరియు అధికారులు పాల్గొన్నారు.
0 కామెంట్లు