-భక్తులకు ఇబ్బందులు లేకుండా సమగ్ర చర్యలు – కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశాలు
నాగర్కర్నూల్, మార్చి 26 (ఎస్బి న్యూస్ ప్రతినిధి): నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని లింగాల మండల పరిధిలో నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన స్వయంభూ లింగమయ్య స్వామి ఆలయంలో జరిగే సలేశ్వరం జాతరకు జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేపట్టింది. ఏప్రిల్ 1 నుంచి 3 వరకు జరిగే ఈ జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు.
గురువారం కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి నల్లమల అటవీ ప్రాంతాన్ని సందర్శించి జాతర ఏర్పాట్లు, ట్రెక్కింగ్ మార్గాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అడవిలోని క్లిష్ట పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి సంవత్సరం భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈసారి మరింత రద్దీ ఉండే అవకాశముందని తెలిపారు.
భక్తుల సౌకర్యార్థం తాగునీటి సరఫరా, వైద్య సేవలు, తాత్కాలిక శిబిరాలు, భద్రతా ఏర్పాట్లు సమర్థంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అడవి మార్గాల్లో స్పష్టమైన మార్గదర్శక బోర్డులు, ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక సూచనలు ఏర్పాటు చేయాలని, అవసరమైన చోట్ల సిబ్బందిని నియమించాలని సూచించారు.
శుభ్రత నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, చెత్త నియంత్రణ చర్యలు చేపట్టాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేందుకు వైద్య బృందాలు సిద్ధంగా ఉండాలని, అగ్నిప్రమాదాల నివారణకు ఫైర్ సిబ్బంది, ఫైర్ ఇంజిన్లు అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు.
భక్తుల రద్దీ నియంత్రణకు ముఖ్య ప్రదేశాల్లో మైక్ సిస్టమ్ ఏర్పాటు చేసి సమాచారాన్ని అందించాలని, పోలీస్ శాఖ ద్వారా ప్రత్యేక ఔట్పోస్ట్ ఏర్పాటు చేసి భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. తప్పిపోయిన భక్తులను గుర్తించి కుటుంబ సభ్యులకు చేర్చే చర్యలు తీసుకోవాలని సూచించారు.
వేసవి తీవ్రత దృష్ట్యా తాగునీటి సరఫరా విస్తరించడంతో పాటు నీడ కల్పించే శిబిరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. విశ్రాంతి కోసం తాత్కాలిక షెడ్లు, టెంట్లు, వైద్య శిబిరాలు సిద్ధంగా ఉంచాలని సూచించారు. మహిళల కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని స్పష్టం చేశారు.
భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని గర్భిణీ మహిళలు, వృద్ధులు, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారు జాతరకు రాకుండా ఉండాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. నల్లమల అడవిలోని కఠినమైన ట్రెక్కింగ్ మార్గాలు, అధిక ఉష్ణోగ్రతలు ఆరోగ్యానికి ప్రమాదకరమయ్యే అవకాశముందని హెచ్చరించారు.
అత్యవసర పరిస్థితుల్లో వైద్య సహాయం అందుబాటులో ఉన్నప్పటికీ, భక్తులు తమ ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. భక్తులందరికీ సురక్షిత, సౌకర్యవంతమైన వాతావరణంలో స్వామి దర్శనం కల్పించడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి రేవంత్ చంద్ర, అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
#సలేశ్వరం #జాతర #నాగర్కర్నూల్ #నల్లమల #భక్తులసౌకర్యం #ప్రభుత్వఎర్పాట్లు
0 కామెంట్లు