యాంటీ ర్యాగింగ్‌పై అవగాహన సదస్సు

యాంటీ ర్యాగింగ్‌పై అవగాహన సదస్సు
భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి)లో యాంటీ ర్యాగింగ్ వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు ర్యాగింగ్‌పై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సదస్సు నిర్వహించారు. కళాశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపల్ శ్రీమతి హవీలా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి సబ్‌ఇన్‌స్పెక్టర్లు స్వప్న, రాంబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కళాశాల యాంటీ ర్యాగింగ్ కమిటీ కోఆర్డినేటర్ డాక్టర్ కపిల భారతి, ఉమెన్ ఎంపవర్‌మెంట్ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ రాగసుమ కార్యక్రమ నిర్వహణలో పాల్గొని అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఇన్‌చార్జ్ ప్రిన్సిపల్ హవీలా మాట్లాడుతూ కళాశాలలో యాంటీ ర్యాగింగ్ కమిటీ నిరంతరం పనిచేస్తోందని తెలిపారు. విద్యార్థులు ఎవరైనా ర్యాగింగ్‌కు గురైనట్లయితే భయపడకుండా యాంటీ ర్యాగింగ్ కమిటీకి ఫిర్యాదు చేయాలని సూచించారు. బాధిత విద్యార్థులకు అవసరమైన కౌన్సిలింగ్ అందించి, సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థుల భద్రత, ఆత్మగౌరవానికి కళాశాల యాజమాన్యం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు .
సబ్‌ఇన్‌స్పెక్టర్ రాంబాబు మాట్లాడుతూ ర్యాగింగ్ వల్ల విద్యార్థులపై తీవ్ర మానసిక ప్రభావం పడే అవకాశం ఉందని అన్నారు. సరదా పేరుతో తోటి విద్యార్థులను ఇబ్బంది పెట్టడం కూడా ర్యాగింగ్ పరిధిలోకి వస్తుందని తెలిపారు. ర్యాగింగ్‌కు పాల్పడటం వల్ల విద్యార్థుల విద్యాభవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం పడటంతో పాటు చట్టపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వివరించారు. విద్యార్థులు పరస్పరం స్నేహభావంతో మెలగాలని సూచించారు.
సబ్‌ఇన్‌స్పెక్టర్ స్వప్న మాట్లాడుతూ విద్యార్థులు తమ చదువులకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. తోటి విద్యార్థులను ర్యాగింగ్ చేయడం, అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం ద్వారా సమస్యలను పోలీస్‌స్టేషన్ వరకు తీసుకురావద్దని హితవు పలికారు. కళాశాలలో స్నేహపూర్వక వాతావరణాన్ని కొనసాగించేందుకు ప్రతి విద్యార్థి బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. సమస్యలు ఎదురైతే నేరుగా కళాశాల యాజమాన్యం లేదా పోలీసులను సంప్రదించాలని సూచించారు.
ఉమెన్ ఎంపవర్‌మెంట్ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ రాగసుమ మాట్లాడుతూ విద్యార్థినులు ఎలాంటి సమస్య ఎదురైనా భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. కళాశాలలోని ఉమెన్ ఎంపవర్‌మెంట్ సెల్ ద్వారా అందించే సూచనలు, సలహాలను విద్యార్థినులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థినుల భద్రత, ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు సెల్ అందుబాటులో ఉంటుందని తెలిపారు.ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా విద్యార్థుల్లో అవగాహన పెంపొందించడంతో పాటు, కళాశాలలో సురక్షితమైన, ఆహ్లాదకరమైన విద్యా వాతావరణాన్ని కల్పించడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ నాగ సమీరా, సుధాకర్, రమేష్, పూర్ణిమతో పాటు కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు