సమస్యను వెంటనే పరిష్కరించాలని కెవిపిఎస్, వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్
ఆదోని: స్వాతంత్ర్యం వచ్చి 79 సంవత్సరాలు గడిచినా దళిత కాలనీలో కనీస త్రాగునీటి సౌకర్యం కల్పించకపోవడం ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే. లింగన్న, కెవిపిఎస్ మండల నాయకులు చక్రవర్తి, అంజి తీవ్రంగా విమర్శించారు. డాణపురం గ్రామంలోని ఎస్సీ కాలనీలో నెలకొన్న త్రాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ బుధవారం కాలనీ మహిళలతో కలిసి గ్రామ సచివాలయం ముందు ఖాళీ బిందెలతో వినూత్నంగా నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, గ్రామానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఎన్నోసార్లు కాలనీని సందర్శించి తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని హామీలు ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీలోని ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
గ్రామంలోని ఇతర ప్రాంతాలకు తాగునీరు సక్రమంగా సరఫరా అవుతున్నప్పటికీ ఎస్సీ కాలనీ విషయంలో మాత్రం వివక్ష చూపుతున్నారని వారు విమర్శించారు. గతంలో ఎమ్మెల్యే పార్థసారథి కాలనీకి వచ్చిన సమయంలో సమస్యను వివరించినా స్పందించలేదని, ఖాళీ బిందెను డప్పులా కొడుతూ నవ్వి వెళ్లిపోయారని కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల గ్రామ పర్యటనకు వచ్చిన సందర్భంగా కూడా "మీరే చందాలు వేసుకుని తాగునీరు తెచ్చుకోండి" అని ఉచిత సలహా ఇచ్చారని పేర్కొంటూ, ప్రజాప్రతినిధి నుంచి అలాంటి స్పందన రావడం బాధాకరమని అన్నారు.
స్థానిక ఎమ్మెల్యేనే ఈ విధంగా మాట్లాడితే తమ సమస్యకు పరిష్కారం ఎలా లభిస్తుందని కాలనీ ప్రజలు ప్రశ్నించారు. ప్రజలకు తాగునీరు అందించడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని, దానిని విస్మరించడం తగదని నాయకులు పేర్కొన్నారు.
ఇప్పటికైనా ఆదోని పర్యటనకు రానున్న మంత్రి నారా లోకేష్తో పాటు కూటమి ప్రభుత్వ నాయకులు స్పందించి డాణపురం ఎస్సీ కాలనీలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కాలనీ మహిళలు, ప్రజలందరూ ఖాళీ బిందెలతో పెద్దఎత్తున రోడ్డెక్కి ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.
నిరసన అనంతరం కాలనీ ప్రజల సమస్యలను వివరిస్తూ వెల్ఫేర్ అసిస్టెంట్కు వినతిపత్రం అందజేశారు. అధికారులు తక్షణమే స్పందించి తాగునీటి సరఫరా పునరుద్ధరించడంతో పాటు శాశ్వత పరిష్కారం కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామ ప్రజలకు కనీస అవసరమైన తాగునీటి సౌకర్యం కల్పించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని కెవిపిఎస్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు స్పష్టం చేశారు.
0 కామెంట్లు