శిరీష మృతిపై ఆదివాసీల ఆగ్రహం..
శిరీషకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు!
ఆదివాసీ నిరుపేద శిరీష కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలి
మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి: ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ
*గుండాల మండలం ఆగస్టు 31 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి*
ములకలపల్లి మండలం చౌటిగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీ యువతి ఊకే శిరీష మృతి ఘటనపై న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ఆధ్వర్యంలో సోమవారం గుండాల మండల కేంద్రంలో భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. గుండాల గ్రామపంచాయతీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీలో ఆదివాసీ నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు, రాజకీయ నాయకులు, ప్రజలు పాల్గొని శిరీషకు కొవ్వొత్తులతో నివాళులర్పించారు.
ఈ సందర్భంగా తుడుం దెబ్బ రాష్ట్ర నాయకులు పూనెం శ్రీనివాస్ మాట్లాడుతూ.. శిరీషపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులను వెంటనే గుర్తించి, చట్టపరంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. ప్రభుత్వం స్పందించడంలో జాప్యం చేయడం బాధాకరమన్నారు.
అగ్రకులాల సమస్యలపై ప్రభుత్వాలు ఒక విధంగా, ఆదివాసీల సమస్యలపై మరో విధంగా స్పందిస్తున్నాయనే భావన ప్రజల్లో నెలకొంటోందని శ్రీనివాస్ అన్నారు. ఆదివాసీ యువతిపై ఇలాంటి దారుణ ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివాసీల ఓట్లతో ఎన్నికైన ప్రజాప్రతినిధులు శిరీష కుటుంబాన్ని పరామర్శించి, న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.
అగ్రకులాలకు ఒక న్యాయం, ఆదివాసీలకు మరో న్యాయం అనే విధానం కొనసాగితే ఊరుకునేది లేదని నాయకులు హెచ్చరించారు. శిరీష కుటుంబానికి రూ.కోటి ఎక్స్గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు.
కార్యక్రమంలో తుడుం దెబ్బ మండల అధ్యక్షులు గోవింద నరసింహరావు, చింత వెంకటేశ్వర్లు, ఈసం సాంబయ్య, మహేందర్, ప్రభాకర్, సుధాకర్, రవి, రజక సంఘ నాయకులు లక్ష్మీనారాయణ గ్రామస్తులు శ్రీధర్, స్వామి తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్లు